తిరుమల లడ్డూని రాజకీయం చేశారు... అందుకే ఇలా జరిగింది: గుడివాడ అమర్ నాథ్

  • తిరుపతి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న అమర్ నాథ్
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చెపుతారని ప్రశ్న
తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తనదైన శైలిలో స్పందించారు. తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని... మృతి చెందిన కుటుంబాలకు రూ. కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

తిరుమల లడ్డూని రాజకీయం చేశారని... అందుకే ఇలాంటి విషాదకర ఘటనలు జరుగుతున్నాయని అందరూ అనుకుంటున్నారని అమర్ నాథ్ చెప్పారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు వైసీపీ తరపున ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని చెప్పారు. 

ప్రధాని మోదీ భజన మానేసి.. తిరుపతిలో భక్తుల సౌకర్యాల మీద దృష్టి సారించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదని అమర్ నాథ్ అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడే నాయకుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. గతంలో సనాతన ధర్మ దీక్షను చేసిన పవన్... ఇప్పుడు ఏ దీక్ష చేస్తారో చూస్తామని అన్నారు.

ఏపీకి మోదీ నిన్న ఎలాంటి హామీలు ఇవ్వలేదని విమర్శించారు. మెజార్టీ ప్రాజెక్టులన్నీ గతంలో చెప్పినవేనని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని అమర్ నాథ్ దుయ్యబట్టారు.  

Gudivada Amarnath
YSRCP
Pawan Kalyan
Janasena

More Telugu News